క్రైస్తవ పరిచర్య

3/278

అధ్యాయం-1
సేవకు దేవుని పిలుపు

మానవ సాధనాలపై ఆధారపడటం

ప్రజల మధ్య తన ప్రతినిధులుగా ఎన్నడూ పతనంకాని దేవదూతల్ని కాదుగాని, తాము ఎవరిని రక్షించటానికి ప్రయత్నిస్తున్నారో ఆ మనుషుల్లాంటి స్వభావాలు ఉద్రేకాలు గల మానవుల్ని, దేవుడు ఎంపిక చేసుకుంటాడు. మానవుల్ని చేరటానికి క్రీస్తు మానవుడయ్యాడు. లోకానికి రక్షణ తేవటానికి దేవమానవ రక్షకుడు అవసరమయ్యాడు. “శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును” ప్రచురపర్చే బాధ్యతను పవిత్ర ట్రస్టుగా పురుషులకు స్త్రీలకు ఆయన అప్పగించాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 134. ChSTel 1.1

హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశాన్ని చూడండి. పరలోక ప్రభువు తాను ఎంపిక చేసుకున్న శిష్యుల నడుమ నివసించటం వీక్షించండి. వారిని తాము చేయవలసిన సేవకు ప్రత్యేకించటానికి ఆయన సన్నద్ధమౌతున్నాడు. ఈ బలహీన సాధనాల ద్వారా, తన వాక్యం ఆత్మ ద్వారా రక్షణను ప్రజలందరి అందుబాటులో ఉంచాలన్నది ఆయన సంకల్పం. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 18. ChSTel 1.2

“ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము” ఈ రకంగా సువార్త పరిచర్యపట్ల తన వ్యవస్థీకృత సంఘంపట్ల ప్రభువు తన మన్ననకు నిదర్శనాన్నిచ్చాడు. కొర్నేలికి సిలువ కథను చెప్పటానికి ప్రభువు దేవదూతను నేరుగా పంపలేదు. సిలువపొంది మరణించి తిరిగి లేచిన రక్షకుణ్ని గూర్చి చెప్పటానికి కొర్నేలీలాగే మానవ దుర్బలతలకి శోధనలకి లోనయ్యే ఒక మనుషుణ్ని పంపాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 134. ChSTel 1.3

ఫిలిప్పు వద్దకు పంపబడ్డ దేవదూత తానే నేరుగా ఆ ఐయోఫీయుడికి సహాయం చెయ్యగలిగేవాడే. కాని ఇది దేవుని పనితీరుకాదు. మనుషుడు సాటి మనుషుల కోసం పని చెయ్యటం ఆయన ప్రణాళిక. ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 107. ChSTel 2.1

“ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదైయుండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు” అంటున్నాడు అపొస్తలుడు. దేవుడు పాపరహిత దూతల్ని వినియోగించి, తన సత్యాన్ని ప్రచురించగలిగి ఉండేవాడే. కాని ఇది ఆయన ప్రణాళిక కాదు. తన సంకల్పం అమలుకి సాధనాలుగా బలహీనతలతో నిండిన మానవుల్ని ఆయన ఎంపిక చేసుకుంటాడు. అమూల్యమైన ఐశ్వర్యం మట్టి ఘటాల్లో ఉంచుతాడు. ఆయన మేళ్ళు ఉపకారాలు మనుషుల ద్వారా లోకానికి అందాల్సి ఉంది. ఆయన మహిమ మనుషుల ద్వారా పాపపు చీకటిలో ప్రకాశంచాల్సి ఉంది. వారు పాపుల్ని లేమిలో ఉన్నవారిని కలిసి ప్రేమపూర్వక సేవల ద్వారా సిలువ వద్దకు నడిపించాలి. తమ సేవ అంతటిలోను వారు ఆయనకి మహిమ ఘనత స్తోత్రం చెల్లించాలి. సర్వాధికారి సర్వోన్నతుడు ఆయనే. ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 330. ChSTel 2.2

పరలోకానికి ఆరోహణమైన తర్వాత మానవుడి విజ్ఞాపకుడిగా సేవ చెయ్యటం రక్షకుని ఉద్దేశం. ఆయన ప్రారంభించిన పరిచర్యను ఆయన అనుచరులు కొనసాగించాలి. చీకటిలో నివసిస్తున్నవారికి సువార్త వెలుగు ప్రకాశింపచెయ్యటంలో మానవ సాధనం ప్రత్యేక శ్రద్ద ఆసక్తి కనపర్చనక్కరలేదా? సువార్త వెలుగును మనుషులికి ప్రకాశింపజేసేందు కోసం భూదిగంతాలకి వెళ్ళటానికి సంసిద్దంగా ఉండేవారు కొందరున్నారు. కాని సత్యం తెలిసిన ప్రతీవ్యక్తి సత్యంపట్ల ఇతరులికి ప్రేమ పుట్టించటానికి ప్రయత్నించాలని దేవుడు డిమాండు చేస్తున్నాడు. నశించిపోటానికి సిద్ధంగా ఉన్న ఆత్మల్ని రక్షించటానికి ప్రత్యేక త్యాగాలు చెయ్యటానికి మనం సమ్మతంగా లేకపోతే, దేవుని పరిశుద్ద పట్టణంలో ప్రవేశించటానికి ఎలా పాత్రులం కాగలం? టెస్టిమొనీస్, సం.9, పు. 103. మహాజ్ఞాని అయిన దేవుడు సత్యాన్ని వెదకేవారికి సత్యం ఎరిగిన వారితో పరిచయం ఏర్పర్చుతాడు. వెలుగు పొందినవారు చీకటిలో మగ్గుతున్న వారికి వెలుగును ప్రకాశింపజెయ్యాలన్నది దేవుని ప్రణాళిక. వివేకానికి మూలమైన ప్రభువు వద్ద నుంచి ప్రతిభాసామర్థ్యాలు పొందిన మనుషుణ్ని సహకారిగాను సాధనంగాను ప్రభువు మలుచుతాడు. ఆ సాధనం ద్వారా సువార్త మనసును హృదయాన్ని మార్చుతుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 134. ChSTel 2.3

పాపుల్ని రక్షించటమన్న తన లక్ష్యాన్ని ఆయన మన సహాయం లేకుండానే సాధించగలిగేవాడు. అయితే క్రీస్తు ప్రవర్త వంటి ప్రవర్తనను నిర్మించుకోటానికి మనం ఆయన సేవలో భాగం పంచుకోటం అవసరం. తన త్యాగం ద్వారా రక్షణ పొందినవారిని చూసి ఆనందించే ఆయన ఆనందంలో ప్రవేశించటానికి, వారిని రక్షించటానికి ఆయన చేసే సేవలో మనం పాల్గొనాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 296. ChSTel 3.1

మనుషుల మధ్య తన ప్రతినిదులుగా నివసించటానికి, ఎన్నడూ పాపం చెయ్యని దూతల్ని కాదుగాని ఎవరిని రక్షించటానికి తాము పాటుపడుతున్నారో ఆ మనుషుల స్వభావాల వంటి స్వభావాలు ఆవేశాల వంటి ఆవేశాలు గల మనుషుల్ని క్రీస్తు ఎంపిక చేసుకుంటాడు. మానవుల్ని చేరటానికి క్రీస్తు మానవుడయ్యాడు. దేవత్వానికి మానవత్వం అవసరమయ్యింది. ఎందుకంటే లోకాన్ని రక్షించటానికి దేవత్వం మానవత్వం రెండూ అవసరమే. దేవునికి మానవుడికి మధ్య సంప్రదింపుల మార్గంగా ఉండటానికి దేవత్వానికి మానవత్వం అవసరమయ్యింది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 296. ChSTel 3.2

దాదాపు ఆపుకోలేని ఆతురతతో దేవదూతలు మన సహకారం కోసం వేచి ఉంటారు, ఎందుకంటే మనుషుడితో మాట్లాడటానికి మనుషుడే మాధ్యమం. మనఃపూర్వక భక్తితో మనల్ని మనం క్రీస్తుకి ప్రతిష్ఠించు కున్నప్పుడు మన స్వరాల ద్వారా దేవుని ప్రేమను వ్యక్తంచేస్తూ, మాట్లాడటానికి దేవదూతలు ఆనందిస్తారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 297. ChSTel 3.3

మనం దేవుని పక్క నిలిచి పనిచేసే సేవకులం కావాలి. మానవుల సహకారం లేకుండా దేవుడు తన పనిని ముగించడు.రివ్యూ అండ్ హెరల్డ్, మార్చి 1, 1887. ChSTel 3.4